దృష్టిలో పడడం
“ఘటం చిద్యాత్
పటం బిద్యాత్
ఏనకే ప్రకారేణ
ప్రసిధ్ధః పురుషా భవేత్!”
అంటే నడి వీధిలో కుండ బద్దలుకోట్టయినా, పటం పగలగోట్టయినా, ఎలాగో ఒకలాగా జనాల దృష్టిలో పడి,
గుర్తింపు పొందమన్నారు.
ఆ మధ్య కార్ లో ఎఫ్ ఎం radio వింటుంటే, ఒకరు లేడీ RJ దృష్టిలో పడాలని,' ఓయ్ జో, ఎవరో గురతుపట్టావా?
చెప్పుకో చూద్దాం.' అంటూ ఆవిడ మేధాశక్తికి సవాల్ విసిరాడు. పాపం ఆవిడ ' వేణు, అప్పారావు, సురేష్,
మాధవ్, యాదవ్ ' అంటూ రకరకాల పేర్లు చెప్పింది. చివరికి ఓడిపోయానని ఒప్పెసుకున్నకా , 'It's me yaar,
రాంబాబు' అన్నాడు. వెంటనే, అష్టాచెమ్మ సినిమాలో,' రాంబాబు, ఎలా ఉందా సౌండ్? బాబ్బాబు అని
అడుక్కున్నట్టు లేదు? , అన్న స్వాతి మాటలు గుర్తొచ్చి, నీ పేరుకు అంత బిల్డ్ అప్ అవసరమా బాబు,
అనుకుంటూ నవ్వుకున్నాను.
కుర్రకారుకు అమ్మాయిల దృష్టిలో పడాలని తాపత్రయం. అందుకు కారు కూతలు కూసో, బైక్ మీద విన్యాసాలు
చేసో, ఒక పాట పాడో, డాన్సు చేసో, తిప్పలు పడుతుంటారు. పాపం వీళ్ళ కష్టాలు ఈ మధ్య బాగా
పెరిగిపోయాయట. కారణం, అమ్మాయిలు ముసుగులు వేసుకోవడం. అన్నీ ముసుగులా మధ్య వాళ్ళు
వెంటబడాలని తీర్మానించుకున్న ముసుగు ఏదో గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉందట. మెల్లిగా, 'ఒరేయ్ బావ, తెల్ల
చుక్కల నల్ల
ముసుగు నీది, ఎర్రచారాల పచ్చముసుగు నీది ' అనుకుంటూ సరిపెట్టుకున్తున్నారట. ఒక వేళ అమ్మాయిలు
ముసుగు మార్చుకున్నా పరవాలేదు, మన వాళ్ళు చాలా adoptive . వాళ్ళు కూడా ముసుగులు ధరించేసి,
కొన్నాళ్ళు అమ్మాయిలని యేడిపించేయ్యగలరు.
ఇల్లాళ్ళకి అందరి దృష్టిలో పడిపోవాలని తాపత్రయం. అందుకోసం కొందరు మంచి ముగ్గులేసి, కొందరు బాగా
వంట చేసి, కొందరు చీరలు అమ్మి, కొందరు హస్త కళలు చూపించి, కొందరు బాగా అలంకరించుకుని
కష్టపడుతుంటే, పద్మిని వంటి గడుసు వాళ్ళు బ్లాగ్లు పెట్టేసి, తెగ రాసేసి, చావగొడుతుంటారు. మరి కొందరు
మీడియా వాళ్ళని ఇళ్ళకి పిలిచి, వంటలు చేసి, పాటలు పాడి, పూజలు చేసి చూపించి సరదా తీర్చుకుంటారు.
పాపం ఆ anchor ల పరిస్థితి చూడాలి, వంటలు ఎంత ఛండాలంగా ఉన్నా 'చాలా బాగుందండి, తోటకూర పుట్ట
గొడుగు కూర' అంటూ మెచ్చుకుంటారు.
అది చూసే వాళ్ళంతా ఆ వంట చేసి, చేతులు కాల్చుకుంటారు.
మా అపార్ట్మెంట్ లో ఒక ' కాల పురుషుడు' ఉన్నాడండి. అది మేము పెట్టుకున్న నిక్ నేమ్. మా అందరికీ
పూజారి, కం ఉపన్యాసకుడు కం పాటగాడు, కం ఆటగాడు కం విదూషకుడు కం వంటవాడు. ఇన్నెలా చేస్తాడండి?
అంటారా, అవకాశాన్ని బట్టి ,ఒక్కోసారి ఒక్కో అవతారం ఎత్తుతాడు, మైక్ దొరికితే చాలు మైకాసురుడు లాగ
వోదలడు. ఆయన నూతన సంవత్సర ప్రసంగం, ' కాంప్లెక్స్ వాసులు అందరికీ, కాలం ఎంతో విలువయినది. కాలం
పొతే మళ్ళి రాదు( నీకిదేమి పోయేకాలం రా, బాబు), కాలం కలకాలం ఉండదు, జారిపోతుంది. కాల పురుషుడు
అందరిని మిన్గేస్తుంటాడు.(నీ లాగ నా), ఇప్పుడు, పోయిన సంవత్సర కాలం పోయింది, కొత్త సంవత్సరం వస్తాది.
ఈ కాలాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి.....' అంటూ చెప్పుకుంటూ పోతుంటే, ఎవరో పుణ్యాత్ములు
,ఆయన్ని పక్కకి మోసుకు పోయి, నోరు మూసేసి, మైక్ లాగేసుకున్నారు. మొన్న రామ నవమికి ఆయనే
పూజారి, పుస్తకం తెచ్చుకు చదివేశాడు, ప్రసాదాల వంట వాడు, ఎంతయినా సమరోత్సాహం ఆయనది, దృష్టిలో
పడాలని.
క్రికెట్ మ్యాచ్ లో చూస్తుంటాం. రంగు రంగుల విగ్గులు, ప్లకార్డ్లు పట్టుకుని కొందరు నాట్యమాడుతుంటే, కొందరు
అరిచి గగ్గోలు పెడతారు. కొందరు నున్నటి బోడి గుండు మీద వాళ్ళ దేశపు జండా రాయించుకుని కూర్చుంటారు.
కొందరు బుగ్గ మీద టాటూ వేయించుకుంటారు. కళా పోషకులయిన కెమేర మాన్లు బోడి గుండుకి, బుగ్గ బొమ్మకి
సమాన న్యాయం చేస్తారు. సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు జనాలకి రకరకాల పోటీలు పెట్టి దృష్టిలో పడితే,
రాజకీయ నాయకులు ఒకరినొకరు బండ బూతులు తిట్టుకుంటూ, దృష్టిలో పడతారు.
మీరు కూడా దృష్టిలో పడాలనుకుంటున్నారా ? నా దగ్గరొక బ్రహ్మాండమయిన ఐడియా ఉందండి. like కొట్టి
కామెంట్ చెయ్యండి మరి, అంతే.
|
ఆలోచనలు |
'మనిషి కంటే మనిషి ఆలోచనలే ఎక్కువ శక్తివంతమయినవి.'
'ఊహాశక్తి తెలివితేటల కంటే కూడా బలమయినది.'
ఆలోచన ఒక ప్రచండ శక్తి.ఆలోచనలు సంకల్పాలుగా మారినప్పుడు, ప్రకృతి సైతం తన నియమాలను ప్రక్కకు
పెట్టి, వాటికి అనువుగా మారుతుంది.మనిషి ఆలోచనలను బట్టి అతని ప్రవర్తన, ఆశయాలు, హావభావాలు,
జీవన విధానం మాత్రమే కాక శరీరం లోని తేజస్సు కూడా ప్రభావితం అవుతుంది.
మంచి ఆలోచనలు అధికంగా ఉన్నచోట అలాంటి వాతావరణమే ఏర్పడుతుంది. ఉదాహరణకు, రుష్యాశ్రమాలలోని
శాంతి, అహింస, సత్యం, ప్రేమ, ధర్మం వంటి సదాలోచనల వల్ల క్రూర జంతువులు సైతం తమ హింసను
వదిలివేసి సాదుస్వభావంతో నడుచుకుంటాయి.
అసహ్యం, ద్వేషం, పగ, క్రోధం,కపటం వంటి దురాలోచనలు ఉన్న చోట, నరక తుల్యమయిన పరిస్థితులు
ఏర్పడతాయి.
'నేను దురదృష్టవంతుడ్ని, కష్టాలన్నీ నాకే వస్తాయి, దుఃఖం నన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏ పనిచేసినా కలిసి
రాదు', అనుకుంటూ తన మీద తనే జాలిపడే వ్యక్తి అలాంటి దీనమయిన, హీనమయిన స్థితి లోనే శాశ్వతంగా
ఉండిపోతాడు.
మనిషికి తప్పులను ఆత్మవిమర్శ ద్వారా తెలుసుకుని, సరిదిద్దుకునే అవకాశం ఉంది. కాని మనిషి దానిని తనపై
కాకుండా ఇతరుల దోషాలు ఎంచడానికి ప్రయోగిస్తాడు. ఫలితంగా బాధాకరమయిన పరిస్థితులు ఏర్పడతాయి.
మనసు అద్దం లాంటిది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ అద్దంపై ధూళి పేరుకుపోతుంది. ఆ అద్దాన్ని
కడగడం తెలిసిన వ్యక్తి, జీవిత రహస్యాన్ని తెలుసుకుంటాడు.
ప్రతి రోజు ఒక పునర్జన్మ. ప్రతి ఉదయం ఒక శుభారంభం. ప్రతి రోజూ నిద్ర లేవగానే,'ఈ రోజు చాలా మంచి రోజు.
దేవుడు నా వెంట ఉన్నాడు. అదృష్టం నా వెంట ఉంది, అనుకున్న పనులన్నీ ఇవాళ పూర్తవుతాయి.' అనుకుంటే,
రోజంతా ఆహ్లాదంగా గడుస్తుంది. మనిషిలో సామర్ధ్యం, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, మంచి ఆలోచనలు ఉంటే,
ప్రగతి, ఉన్నతి, తమంతట తాముగా ద్వారాలు తెరుస్తాయి. శుభమస్తు .
|
వద్దు |
మీరు ఎన్నయినా చెప్పండి, వద్దన్న పని చెయ్యడంలో భలే సరదా ఉంది. అలా వద్దన్నపని చేసి ఎదుటివాళ్ళను
ఉడికించడంలో మంచి వినోదం ఉంది. ఏంటండి? మీరెప్పుడు వద్దన్న పని చెయ్యలేదా? 'రాముడు మంచి బాలుడు
'వంటి వారా? అయితే చదవండి, క్రింది వాటిలో ఒక్కటయినా తప్పకుండా మీరు చేసే ఉంటారు.
చిన్నప్పుడు అమ్మ ఆడుకోవద్దు, జంతికల డబ్బా తియ్యద్దు,చెట్లు ఎక్కద్దు, గోడ ఎక్కద్దు,అంటూ, ఇప్పటి
అమ్మలయితే కార్టూన్లు చూడద్దు అంటూ ఉంటారు కదా. అలా వద్దన్న కొద్దీ పిల్లలు ఆడుకోవడానికి, కార్టూన్లు
చూడడానికి మరింత ఆసక్తి చూపుతారు. అందుకే, ఇలాంటి విషయాల్లో అపసవ్యదిశను వాడాలండి. అంటే
ఆడుకొమ్మని, అన్నీ తినమని చెప్పాలన్న మాట. మా అమ్మయితే నన్ను అలగద్దని చెప్పేది. తను చెప్పెకొద్దీ
నేను ఇంకాస్త ఎక్కువ అలిగేసి, ఒక మూల పేపర్, పెన్సిల్ తీసుకుని బొమ్మలు గీసుకునే దాన్ని. అందుకే నాకు
చిత్రలేఖనం ఎవరి వద్దా నేర్చుకోకుండానే అబ్బింది. అలక వల్ల ప్రయోజనం అన్నమాట.
ఇక యువత బుద్ధిగా ఉండమని, ప్రేమ వ్యవహారాల్లో పడకుండా చక్కగా చదువుకొమ్మని, పరీక్షల్లో కాపీ కొట్టద్దని,
బైక్ల మీద దూకుడుగా వెళ్లోద్దని, నడిచే బస్సు ఎక్కద్దని, పదే పదే చెప్పించుకుని, గడప దాటగానే, ఈ చెవితో
విన్నవి ఆ చెవితో వదిలేస్తారన్నమాట. ఇల్లాళ్ళు వద్దన్న కూర వండి, తమ తిరుగుబాటును ప్రకటిస్తారు.
ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే, వాళ్ళ గుమ్మం దగ్గర చెత్త వేసి మరీ కసి తీర్చుకుంటారు.
మగవాళ్ళు బాస్ లేట్ గా రావద్దని ఎంత గింజుకున్నా, ఒక్క ఐదు నిముషాలయినా లేట్ గా వెళ్లి, బాస్ మీద
ప్రతీకారం తీర్చుకుంటారు.
ప్రభుత్వోద్యోగులు లంచాలు తీసుకోవద్దని ఎంత మొత్తుకున్నా, అమ్యామ్యాలు దండుకుంటూనే ఉంటారు. పదవి
లో ఉన్న రాజకీయ నాయకులు స్కాం ల ద్వారా, డ్యాం ల ద్వారా, వీలుంటే గడ్డి ద్వారా కూడా, వదలకుండా
కాసులు కూడబెట్టుకుంటారు. రైడ్ లు అయితే బెంగ పెట్టుకుంటారు. అసెంబ్లీ లో గొడవలు పెట్టుకుని
అమూల్యమయిన సభా సమయాన్ని వృధా చేయ్యోద్దంటే, మంచి నీళ్ళ పంపు దగ్గర బిందెల వాళ్ళలా,
కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇంకా ఒకళ్ళ గుట్టు ఒకళ్ళు బయట పెట్టుకుంటారు. గుడిలో డబ్బులు కేవలం
హుండిలోనే వెయ్యమంటే, మనం తప్పక పూజారి పళ్ళెం లోనే వేస్తాం.మరి సినిమా వాళ్ళు తమను అనుకరించ
వద్దని, ఫైరసి వద్దని ఎంత వేడుకున్నా, ప్రయోజనం ఉండదు.
ట్రైన్లో సిగరెట్టే కాల్చకూడదంటే, కాల్చే ప్రబుద్ధులని చూస్తున్నాం. హెల్మెట్ లేకుండా బండి నడపద్దంటే, నడిపెస్తాం.
మొబైల్ డ్రైవింగ్ లో వాడద్దంటే, రోడ్డు మీద సగం మంది, వాతం కమ్మిన కోళ్ళలా, బుర్ర ఒక పక్కకి వంచుకుని,
మాట్లాడుతూ నడపడం చూస్తుంటాం. వాళ్ళ సరదా, ట్రాఫ్ఫిక్ పోలీసు పట్టుకున్నా తీరదు. రోడ్డు మీద ఓవర్టెక్
చెయ్యొద్దని, అతి వేగంగా నడపకూడదని చెప్పే సూత్రాలని, కేవలం ఆవులు, గేదెలు, మేకలు మాత్రమే
పాటిస్తాయి.
చివరగా, బాహాటంగా ప్రేమను పంచడం, పబ్లిక్ డిస్ప్లే అఫ్ అఫ్ఫెక్షన్, నేరమని ఎంత చెప్పినా, చెరువు గట్ల వెంట,
బైక్ ల మీద, ప్రేమ జంటలు శ్రుతి మించి, పరిసరాలు మరచి, మైమరచి పోవడం చూస్తున్నాం. వీళ్ళ తిక్క
శివసేన వాళ్ళు మంగళ సూత్రాలు పట్టుకు వెంటబడే దాకా తీరదు.
|
వంట వాడు |
పిల్లల్ని చదివించి, వాళ్ళు ఉద్యోగాల కోసం విదేశాలకు ఎగుమతి అయ్యాక, ఒంటరిగా మిగిలిన ఒక పెద్దావిడ,
వంట వాడి కోసం చూస్తోంది. భారతావనిలో ఇప్పుడు పని వాళ్ళ సంక్షోభం కదండీ, ఎంతో ప్రయత్నించాక, చివరికి
'భీమయ్య' అనే వంటవాడు దొరికాడు.
కాని అతనికో చిన్న బలహీనత. సినిమాలు చూసి చూసీ, రోజూ తనను తాను ఏదో ఒక సినిమాలోని పాత్రగా
ఊహించుకుని, ఆ పాత్రలో లీనమయిపోయి, ఆ డైలాగ్ లు చెబుతూ తిరుగుతుంటాడట. అప్పుడు 'విశ్రాంతి' కార్డు
లేక 'శుభం' కార్డు చూపిస్తే మళ్ళిమన ప్రపంచం లోకి వచ్చేస్తాడట. అది అంత పెద్ద సమస్య కాదు అనుకున్న
పెద్దావిడ భీమయ్యను పనిలో పెట్టుకుంది.
వస్తూనే 'వచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టిన్టికొచ్చా, నీ వంటిన్టికోస్తా చూసుకుందామా, నీ ప్రతాపమూ, నా
ప్రతాపమూ, ' అంటూ మొదలుపెట్టాడు. విశ్రాంతి కార్డు చూపించింది పెద్దావిడ. ఇక ఆ పూట వంటకి 'వంకాయ
కూర' చెయ్యమని చెప్పింది. భీమయ్య బెండకాయలు తీసాడు. తిక్కతో పాటు చెవుడు కూడా ఉందేమో
అనుకున్నపెద్దావిడ, అదేవిటని అడిగితే,'సీతయ్య, ఎవ్వరి మాటా వినడు' అంటూ తల పంకించాడు.
మళ్ళి విశ్రాంతి కార్డు చూపించి, 'బాబు, నువ్వు సీతయ్య వి కాదు భీమయ్యవి' అంటూ సముదాయించి, ఆ
పూటకి ముగించింది. ఏ మాటకు ఆ మాట, వంట బాగా చేసాడు భీమయ్య. ఏదో కొంత సర్దుకుపోతే పరవాలేదులే
అనుకుంది పెద్దావిడ.
సాయంత్రం పెరట్లో గడ్డి మొక్కలు పీకుతున్న పెద్దావిడ దగ్గరకు భీమయ్య కంగారుగా వచ్చి, 'మొక్కే కదా అని
పీకేస్తే పీక కోస్తా..' అంటూ ఆవేశంగా నిలుచున్నాడు.
వంకాయ కూర రుచి గుర్తు తెచ్చుకుంటూ, విరామం కార్డు చూపించింది పెద్దావిడ.
పుచ్చకాయ కోయ్యమని చేతిలో పెట్టింది. 'పుచ్చ పగిలిపోద్ది..' అంటూ పుచ్చకాయ కేసి చూడడం
మొదలుపెట్టాడు భీమయ్య, 'కత్తులతో కాదు, కంటి చూపుతో కోసేస్తా', ఆవేశంగా అంటున్నాడు ,భీమయ్య. ఈ
సారి వాడి మెడలోనే తగిలించిన విశ్రాంతి కార్డు చూపించింది పెద్దావిడ. రాత్రి ఇడ్లీ లోకి కొబ్బరికాయ పచ్చడి
చెయ్యమని చెప్పింది. 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో, వాడే పండుగాడు..' అంటూ
ఆవేశంగా కొబ్బరికాయ కొడుతున్నాడు వాడు. గోడ మీద అంటించిన విశ్రాంతి కార్డు చూపించింది పెద్దావిడ.
మొత్తానికి ఆ రోజు అలా గడిచింది భీమయ్య తో.
మర్నాడు సాంబార్ లోకి ఆనపకాయ కోయ్యమని ఇచ్చింది. 'అమ్మా తోడు, అడ్డంగా నరికేస్తా..' అంటూ
ఆనపకాయని అడ్డంగా, కసిగా తరిగేస్తున్నాడు భీమయ్య. మళ్ళి పెద్దావిడ ...అదన్నమాట. 'ఒరే ఉల్లిపాయ అటు
పక్క కుళ్ళిపోయింది, చూసుకోవేం ' అంటూ మందలించింది.'చూడు, ఒక వైపు చూడు, రెండో వైపు చూడకు,
తట్టుకోలేవు' అంటూ మొదలుపెట్టాడు. స్టవ్ మీద అంటించిన కార్డు చూపించింది ఆవిడ. ఇంక సాంబార్
మొదలుపెట్టి, తీర్ధం లో కొన్న బొమ్మ కెమేర తో ఫోటోలు తీసినట్టు, వెనకాల ఏదోరాసినట్టు చేస్తూ, మాడిపోతున్నా
పట్టించుకోవట్లేదు భీమయ్య. పెద్దావిడకు ఏమి అర్ధం కాలేదు. ఎంత అరచినా వెర్రి చూపులు తప్ప స్పందన లేదు,
చివరకు విరామం కార్డు చూపించాక చెప్పాడు, తను గజినీ పాత్ర లో లీనమయ్యానని, అందుకే డైలాగ్ లు లేవు,
వంట కూడా చూడడం మరచిపోయానని. ఇక శుభం కార్డు చేతికిచ్చి పంపేసింది పెద్దావిడ.