ఆలోచనలు |
'మనిషి కంటే మనిషి ఆలోచనలే ఎక్కువ శక్తివంతమయినవి.'
'ఊహాశక్తి తెలివితేటల కంటే కూడా బలమయినది.'
ఆలోచన ఒక ప్రచండ శక్తి.ఆలోచనలు సంకల్పాలుగా మారినప్పుడు, ప్రకృతి సైతం తన నియమాలను ప్రక్కకు
పెట్టి, వాటికి అనువుగా మారుతుంది.మనిషి ఆలోచనలను బట్టి అతని ప్రవర్తన, ఆశయాలు, హావభావాలు,
జీవన విధానం మాత్రమే కాక శరీరం లోని తేజస్సు కూడా ప్రభావితం అవుతుంది.
మంచి ఆలోచనలు అధికంగా ఉన్నచోట అలాంటి వాతావరణమే ఏర్పడుతుంది. ఉదాహరణకు, రుష్యాశ్రమాలలోని
శాంతి, అహింస, సత్యం, ప్రేమ, ధర్మం వంటి సదాలోచనల వల్ల క్రూర జంతువులు సైతం తమ హింసను
వదిలివేసి సాదుస్వభావంతో నడుచుకుంటాయి.
అసహ్యం, ద్వేషం, పగ, క్రోధం,కపటం వంటి దురాలోచనలు ఉన్న చోట, నరక తుల్యమయిన పరిస్థితులు
ఏర్పడతాయి.
'నేను దురదృష్టవంతుడ్ని, కష్టాలన్నీ నాకే వస్తాయి, దుఃఖం నన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏ పనిచేసినా కలిసి
రాదు', అనుకుంటూ తన మీద తనే జాలిపడే వ్యక్తి అలాంటి దీనమయిన, హీనమయిన స్థితి లోనే శాశ్వతంగా
ఉండిపోతాడు.
మనిషికి తప్పులను ఆత్మవిమర్శ ద్వారా తెలుసుకుని, సరిదిద్దుకునే అవకాశం ఉంది. కాని మనిషి దానిని తనపై
కాకుండా ఇతరుల దోషాలు ఎంచడానికి ప్రయోగిస్తాడు. ఫలితంగా బాధాకరమయిన పరిస్థితులు ఏర్పడతాయి.
మనసు అద్దం లాంటిది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ అద్దంపై ధూళి పేరుకుపోతుంది. ఆ అద్దాన్ని
కడగడం తెలిసిన వ్యక్తి, జీవిత రహస్యాన్ని తెలుసుకుంటాడు.
ప్రతి రోజు ఒక పునర్జన్మ. ప్రతి ఉదయం ఒక శుభారంభం. ప్రతి రోజూ నిద్ర లేవగానే,'ఈ రోజు చాలా మంచి రోజు.
దేవుడు నా వెంట ఉన్నాడు. అదృష్టం నా వెంట ఉంది, అనుకున్న పనులన్నీ ఇవాళ పూర్తవుతాయి.' అనుకుంటే,
రోజంతా ఆహ్లాదంగా గడుస్తుంది. మనిషిలో సామర్ధ్యం, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, మంచి ఆలోచనలు ఉంటే,
ప్రగతి, ఉన్నతి, తమంతట తాముగా ద్వారాలు తెరుస్తాయి. శుభమస్తు .
No comments:
Post a Comment