Tuesday, December 17, 2013

ప్రయాణాల్లో ప్రయాసలు

ప్రయాణాలు అంటే నాకు రెండు రకాల మనస్తత్వాలు గుర్తుకొస్తాయి. ఇక్కడ కొందరు అతివాదులు మరి కొందరు మిత వాదులు ఉంటారు. కానీ సమవాదుల నిష్పత్తి వీళ్ళతో పోలిస్తే తక్కువనే చెప్పాలి.

మా తాతగారు ఆలూరి కృష్ణమూర్తి గారికి ప్రయాణం అంటే విపరీతమైన కంగారు. మూడు రోజుల ముందు నుంచే పెట్టి సర్దేసేవాళ్ళు. రైలు బయల్దేరడానికి ఆరు గంటల ముందే పెట్టె- బేడ , పిల్లా- జల్లా అంతా అక్కడ చేరాల్సిందే. ఒకసారి మేమంతా చిన్నప్పుడు మా బాబాయ్ గృహప్రవేశానికి కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది. మా పటాలం ఒక యాభై దాకా ఉండచ్చు. అంత మందికి ఎక్ష్ప్రెస్ ట్రైన్ అయితే ఖర్చు ఎక్కువని, పాసెంజర్ బుక్ చేసారు. రైలు బయల్దేరే ఆరు గంటల ముందు ట్రంకు పెట్టేలతో, తాతగారి హడావిడి గాభరాతో  అక్కడకి వెళ్ళిపోయాము. అసలే పాసెంజర్ ఎప్పుడూ టైం కి రాదు... ఇక పిల్లలకు ఏమిటి కాలక్షేపం(ఇది పాతికేళ్ళ ముందు కధ) ?

'ఆ జంతికలు... తంపడ కాయలు...', 
'ఆ పాపిడి... సోం  పాపిడి... '
'ఆ చనక్కయలె... వేయించిన చేనక్కయలె...'
'మావిడి తాండ్ర...'
'ఆ బిస్కెట్... బటాని ...'
' మల్లె పూలమ్మా, కనకాంబరాలే...'
'గిలక్కయిలు, బొమ్మలమ్మా...'

అలా ట్రైన్ వచ్చే ఆరుగంటల ముందు నుంచీ మొదలయిన పిల్లల డిమాండ్లు, ఆగి ఆగి పది గంటల్లో చేరాల్సిన పాసెంజర్ బండి పదహారు గంటల్లో చేరి ,మొత్తానికి తాత తన నిర్ణయానికి తల మొత్తుకుని, 'దీని బదులు ఎక్ష్ప్రెస్ రైలు టికెట్లే చవగ్గా అయిపోయేవేమో!' అని వాపోయే దాకా వచ్చేది. ఇది ప్రయాణాల్లో అతి వాదం.

ఇక మితవాదుల సంగతి. వీళ్ళు సరిగ్గా రైలు బయల్దేరే ముందు పడుతూ లేస్తూ, పరిగెడుతూ , రొప్పుతూ ఎక్కుతారు. వీళ్ళకు అదో తుత్తి. పోయిన సారి నేను హైదరాబాద్ నుంచీ తెనాలి వెళ్ళే ట్రైన్ ఎక్కాను. ట్రైన్ విజయవాడలో ఆగింది. బయల్దేరబోతుండగా గట్టిగా కేకలు వినబడ్డాయి.

'ఏవయ్యా టి సి ? నీకు బుద్ధుందా? నువ్వు అక్కడ ప్లాట్ఫారం మీద నిల్చుని ఉంటే, నీ వీపు గోకి, కృష్ణా ఎక్ష్ప్రెస్ ఇదేనా? అని అడిగానా లేదా? చంటి పిల్లలతో ఎక్కితే ఇదేనా చెయ్యడం?'

'చాల్చల్లెవమ్మా , చెప్పొచ్చావ్. కృష్ణా ఇదేనా అని వీపు గోకి అడిగావే కాని, హైదరాబాద్ వైపు వెళ్ళే కృష్ణా ఇదేనా, అని అడిగావా? ఈ సమయంలో రెండు రైళ్ళు ఇక్కడ ఆగుతాయి... చైను లాగి దిగు,' అన్నాడు.

ఆవిడ ఫైను పడితే పడిందని తెగించి, చైను లాగి దిగిపోయింది. పాపం చంటి పిల్లల తల్లి కదా, అందుకే ఫైను వెయ్యలేదుట. ఇలా కదిలే రైల్లోకి దూకే సమరోత్సాహం, ఆ పై వారి వదనాల్లో కనిపించే విజయోత్సాహం చూడాల్సిందే ! పాపం వీళ్ళతో ప్రయాణం చేసే వాళ్ళకే ఒక్కసారిగా బిపి పెరిగి ట్రైన్ ఎక్కి కూర్చోగానే లోటాడు నీళ్ళు తాగెస్తారు. 

మరి ఏం చెయ్యమంటారు పద్మిని గారు? అని అడుగుతారా? చేసేది ఏముంది చెప్పండి, మనం టైముకు వెళ్ళినా ట్రైన్ టైముకు రావాలని లేదుగా... మనం ఎక్కాల్సిన రైళ్ళు మన జీవిత కాలం లేటు... అంతేనండి. 

                                       

2 comments:

  1. హహహహహహహహహ .,నేను రెండవ రకమే..,,,.,,,

    ReplyDelete
  2. హహహహహహహహహ .,నేను రెండవ రకమే..,,,.,,,

    ReplyDelete